సీక్వెల్స్ రైలు పట్టాలెక్కింది గురూ!
అంచనాలను అందుకుంటాయా?
చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్ జోరు పెరిగింది. తొలి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడంతో ఆ కాన్సెప్ట్నకు కొనసాగింపుగా మరో సినిమాను తెరకెక్కించేందుకు దర్శక-నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన పలు సినిమాలు హిట్లుగా నిలిచి.. ప్రశంసలు అందుకున్నాయి. మరికొన్ని భారీ అంచనాల మధ్య వచ్చి.. అభిమానులకు నిరాశను మిగిల్చాయి. గతేడాది వచ్చిన ‘రోబో’ సీక్వెల్ ‘2.ఓ’ పర్వాలేదనిపించింది. త్వరలో ‘రాజుగారి గది 3’ థియేటర్లో సందడి చేయబోతోంది. అదేవిధంగా పలు సినిమాలు ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. వాటి జాబితాను ఓ సారి చూద్దాం..
హారర్ కామెడీ చిత్రంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ‘రాజుగారి గది’. ఓం కార్ దర్శకత్వం వహించారు. దీనికి కొనసాగింపుగా నాగార్జున, సమంత కీలక పాత్రల్లో నటించిన ‘రాజుగారి గది2’ కూడా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మూడో భాగం విడుదలకు సిద్ధమవుతోంది. అశ్విన్, అవికాగోర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబరు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈసారి ఏ సమస్యపై భారతీయుడు పోరాటం
విలక్షణ నటుడు కమల్ హాసన్ కెరీర్లో సూపర్ హిట్గా నిలిచిన ‘భారతీయుడు’కు సీక్వెల్ రాబోతోంది. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ రికార్డులు బద్దలుకొట్టింది. తొలి సినిమాను తెరకెక్కించిన శంకర్ ఈ సీక్వెల్కు దర్శకత్వం వహిస్తున్నారు. తొలి చిత్రంలో లంచగొండితనానికి వ్యతిరేకంగా పోరాడిన కమల్ ఇందులో ఏ సమస్యపై పోరాడతారో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. కమల్తోపాటు కాజల్, రకుల్ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
ఏ రహస్యాన్ని ఛేదిస్తాడు?
యువ కథానాయకుడు నిఖిల్కు మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘కార్తికేయ’. చందు మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం 2014లో ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం అందుకుంది. అంతేకాదు బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. తొలి సినిమాను రూపొందించిన చందూ మొండేటి రెండో భాగం కోసం కథ సిద్ధం చేశారు. మరి ఇందులో నిఖిల్ ఏ గుడి రహస్యం కనుగొంటారో చూడాలి.
డబుల్ ఇస్మార్ట్
‘నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడిముంగట పొట్టెల్ని కట్టేసినట్టే.. ’ అంటూ ‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది విడుదలై హిట్టు అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ఉద్దేశంలో ఉన్నానని పూరీ ఇటీవల తెలిపారు. మరి అది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.
ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ‘ఎఫ్ 3’?
ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అల్లుళ్లు గట్టిగానే నవ్వించారు. వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్ 2’ గురించే ఇదంతా. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎండ్ టైటిల్స్లోనే చెప్పేశారు. ‘ఎఫ్3’ అని పేరు కూడా పెట్టేశారు. వెంకీ, వరుణ్ కూడా నటిస్తామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీనికి సంబంధించి పాయింట్ కూడా సిద్ధం చేశారని, త్వరలో సినిమా మొదలవుతుందని వార్తలొచ్చాయి. దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు మహేష్బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తీస్తున్నారు. దీని తర్వాత ‘ఎఫ్3’ పట్టాలెక్కనున్నట్లు అర్థమవుతోంది. ఇందులో వెంకటేశ్, వరుణ్తేజ్తోపాటు రవితేజ కూడా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. మరి మూడో వ్యక్తిగా ఎవరు నటిస్తారో చూడాలి.
బంగార్రాజు వస్తాడా?
‘సోగ్గాడే చిన్ని నాయనా’ అంటూ నాగార్జున మూడేళ్ల క్రితం సంక్రాంతికి వచ్చి అదరగొట్టేశారు. నాగ్ ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. బంగార్రాజు, ‘రాము’మోహన్గా నాగార్జున రెండు భిన్నమైన షేడ్స్లో కనిపించారు. ఇందులో బంగార్రాజు పాత్రను ప్రధానంగా తీసుకొని ‘బంగార్రాజు’ పేరుతోనే ఓ సినిమా రూపొందిస్తామని దర్శకుడు కల్యాణ్ కృష్ణ గతంలోనే ప్రకటించారు. నాగ్ దీనికి ఓకే కూడా చెప్పేశారు. ఇప్పటికే స్క్రిప్ట్ పని మొదలు పెట్టారు.
మరోసారి ‘గూఢచారి’
చిన్న సినిమాగా విడుదలై కథ, కథనాలతో ప్రేక్షకుడిని ఉత్కంఠతో ఊపేసిన చిత్రం ‘గూఢచారి’. అడవిశేష్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. త్వరలోనే దీనికి సీక్వెల్గా సినిమాను తీయనున్నట్లు అడవి శేష్ ఎప్పుడో ప్రకటించారు. ప్రస్తుతం ఆయన మహేశ్బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘మేజర్’లో నటిస్తున్నారు. దీని తర్వాత ‘గూఢచారి2’ ఉంటుందని అడవి శేష్ స్పష్టం చేశారు.
రాఖీ.. రాఖీభాయ్ ఎలా అయ్యాడు
గతేడాది డిసెంబరులో విడుదలైన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’ యువతను విశేషంగా ఆకట్టుకుంది. రాఖీగా యశ్ నటన, ప్రశాంత్నీల్ టేకింగ్ మాస్లో మంచి ఇమేజ్ను తెచ్చాయి. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్: చాప్టర్2’ తెరకెక్కుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ‘కేజీఎఫ్ చాప్టర్2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరో ‘సింగం’ రానుందా?
సూర్య చిత్రాలకు తమిళనాడులోనే కాదు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా ‘సింగం’ సిరీస్ సినిమాలతో ఆయన మాస్ ఆడియన్స్కు దగ్గరయ్యారు. హరి దర్శకత్వంలో సూర్య ఓ చిత్రంలో నటించనున్నారట. వీళ్లిద్దరి కాంబినేషన్లో రాబోయే కొత్త చిత్రం ‘సింగం’కు సీక్వెల్గా ఉంటుందా? లేక మరేదైనా కొత్త కథతో సెట్స్పైకి వెళ్తారా? అన్నది దానిపై ఇంకా స్పష్టత లేదు.
No comments:
Post a Comment